Monday, September 29, 2008

తెదేపా మద్దతుగా యువ ఇంజనీర్ల సదస్సు

అడ్డులేని అవినీతి.. అంతులేని అశాంతి
చేతకాని ప్రభుత్వాలివి
మండిపడ్డ తెదేపా
మద్దతుగా యువ ఇంజనీర్ల సదస్సు
కె.పి.హెచ్‌.బి.కాలనీ, సెప్టెంబరు 28 (న్యూస్‌టుడే): దేశ శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్‌పాటిల్‌ ఢిల్లీలో ఓ జోకర్‌లా తయారయ్యారని రాష్ట్ర మాజీ డీజీపీ, తెదేపా నాయకుడు పేర్వారం రాములు విమర్శించారు. తెదేపాకు మద్దతుగా మనకోసం తెలుగుదేశం అంటూ యువ ఇంజనీర్లు ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీలోని ఐమాక్స్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా ప్రసంగించారు. ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి ఆశ్రిత పక్షపాత రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి తాబేదార్లకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం అంగుళం భూమి కూడా మిగలని హెచ్చరించారు. సెజ్‌ల పేరుతో పేదల భూమిని పెద్దలకు దోచిపెడుతోందన్నారు. కిందిస్థాయి ఉద్యోగుల అవినీతిపై కొరడా ఝళిపించే ప్రభుత్వం ఐఎఎస్‌, ఐపిఎస్‌ల స్ధాయిలో జరిగే అవినీతిని మాత్రం అసలు పట్టించుకోవడంలేదని రాములు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేంద్రలో శాంతిభధ్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని, ప్రభుత్వాలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాయని విమర్శించారు. సదస్సు ఏర్పాటు చేసిన ఇంజనీర్లను ఆయన అభినందించారు. పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మన ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకున్నట్టే మనరాష్ట్రాన్నికూడా చేతకాని ప్రభుత్వం నుంచి మనమే ప్రస్తుతం కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఐటీ విప్లవం తెదేపా వల్లే జరిగిందన్నారు. శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా తెదేపా వల్లే జరుగుతుందన్నారు. ఐటి నిపుణుడు సతీష్‌ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారికి ఐటి రంగంలో గుర్తింపును చంద్రబాబు తెచ్చారన్నారు. సదస్సులో యువ ఇంజనీర్లు తెదేపా చేట్టిన కార్యక్రమాలు, కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అవినీతిని స్త్లెడ్స్‌ ద్వారా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మేలుకో యువత, కాపాడుకో రాష్ట్రభవిత వంటి నినాదాలతో హోరెత్తించారు. ఇంటిలోని ప్రతిఒక్కరూ తమోటుహక్కును వినియోగించుకోవడంతోపాటు కుటుంబసభ్యులందరినీ ఓటుహక్కు వినియోగించుకోనేలా చూడాలని కోరారు.

source eenaadu Hyd district news.

1 comment:

Anonymous said...

veelanta poyinasari elachanlalo kooda t.d.p ki votesinaaru kaadent.

mari etayindi,congress gelichindi kadeti